ఒక శిల్పి శిలను చెక్కుతున్నపుడు, ఉలికీ శిలకూ నడుమ జరిగే ఘర్షణకు అద్దం పట్టేవి - ఎగిరిపడే నిప్పుల రవ్వలు, ఎగసి వచ్చే లోహపు రవములు.
రవివర్మ రచనలను పరిశీలిస్తే అలాంటి రవ్వలూ, రవములూ స్ఫురణకు వస్తాయి.
అంటే, ఒక కళ రూపుదిద్దుకుంటున్నపుడు జరిగే ఘర్షణను పోలిన అభివ్యక్తి తనలో ఉంది. అందుకని ఏ విషయం చెప్పినా అది తీక్షణంగా ఉంటుంది.
తన రచనల్లో శబ్దసౌందర్యం కన్నా భావ ధ్వని కన్నా రసధునికి ఎక్కవ ప్రాధాన్యత కనబడుతుంది. విశ్లేషణా శక్తి విరివిగా విశదపరుస్తూ మానవ మౌలిక భావాలకు,
చిన్ననాటి చందమామ సారాలకు, సమకాలీన సాంఘిక అంశాలకు, పఠం కట్టి ప్రదర్శిస్తాడు. నిర్దుష్టత, స్థితప్రజ్ఞత లాంటి ఎల్లలను చెరిపి - అపారమైన సహజ స్పందనతో చేసే అనూహ్యమైన భావావేశ కవనం ఆకట్టుకుంటుంది. ప్రక్రియను ఒడిసిపట్టుకుని కవిత్వం రాయడంలో విశిష్టమైన చాకచక్యం కనబరుస్తాడు. పడికట్టు పదాలు, వాడి వాడి అరిగిపోయిన పదబంధాలు ఉండవు. అనవసరమైన అంత్యప్రాసలు అసలుండవు. పదునైన మాటలు(అంటే చుక్క రక్తం లేకుండా చీల్చి చెండాడగలిగినవి) కూర్చి తన భావాలకు వత్తాసుగా సమస్త ప్రకృతిని నిర్దేశించగల కవి.
నిలకడ ఉన్న చోట గుర్తింపు దానంతటదే వస్తుంది.
ప్రతి రోజూ పొడిచే పొద్దుకి ప్రచారం అక్కరలేదు కదా!
-